Tuesday 5 November 2013

SADASIVABRAHMEDRULU

తాపత్రయసాగరమగ్నానాం  ...స్థిరతా నహి నహి రే మానస ' అని పాడుకుంటూ ఉండేదాన్ని నా మెడిసిన్ చదివే రోజులలో... చదువు తప్ప తక్కిన నానారకాలయిన విషయాలన్నీ ఆకర్షిస్తూ ఉండేటప్పుడు. ఆ సంస్కృతం కొద్దిగా  అర్థమవుతూ ఉండటం కాస్త సంబరంగానే ఉండేది. ఉద్దేశ్యపూర్వకంగానే అలా సులభంగా రచించారని తర్వాత అర్థమయింది. ఆ కీర్తన రచించిన సదాశివబ్రహ్మేంద్రులు అద్వైత వేదాంతి, వేదాంత గ్రంథకర్త, మహిమాన్వితులని చెప్పబడే యతీంద్రులు... ఇన్ని అయినా ముముక్షువులు కానివారికి అద్భుతమయిన కీర్తనలు రచించినవారిగానే ముందుగా స్ఫురిస్తారు. పాడుకోవటానికి అనువుగా ఉండేలా క్లుప్తంగా, సరళమైన సంస్కృతంలో ఉంటాయి అన్నీ. 18 వ శతాబ్దంలో కుంభకోణం లో జన్మించిన వీరి తండ్రి పేరు తెలుగు మూలాలని సూచిస్తుందేమో.ఆ పేరు మోక్షసోమసుందర అవధాని. వీరి రచనలు ముఫై పైగా లభ్యమవుతున్నాయి. ఒక్కొక్క కీర్తననీ రెండుమూడు  రాగాలలో  చేసిఉండటం  విశేషం. శిష్యులూ ప్రచారకులూ అయినవారు వారికి అనుకూలమైన రాగాలను ఎంచుకోవటం బహుశా ఈ వైవిధ్యానికి కారణమేమో. అందరికీ ముందు గుర్తొచ్చేది ' మానస సంచరరే ' [సామరాగం లో చేసినదే ప్రసిద్ధం ] తక్కినవి ఇంచుమించూ బాలమురళీకృష్ణ గారు నిమగ్నులై, అర్థం పట్ల శ్రద్ధ వహించినవారై పాడటం వలన తెలుగునాట వ్యాపించాయి. ' పిబరే రామరసం ' [ అహిర్ భైరవి ] ,భజరే గోపాలం [హిందోళం ] ప్రసిద్ధమైనవే. నాకు ప్రత్యేకించి నచ్చేవి పైన ప్రస్తావించిన ' స్థిరతా నహి నహి రే ' , ' స్మరవారం వారం ' [ పిబరే రామరసం ని ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారు 'పడమటి సంధ్యారాగం ' లో భిన్నంగా వినిపించి సంతోషించారు. అహిర్ భైరవి లోని ఆర్తి తీవ్రతని తగ్గించే ప్రయత్నమేదో జరిగి భావం పలుచనయిందనిపించింది అదే కీర్తనని అనుసరించి ' కథానాయిక మొల్ల ' లో ఎస్. పి.కోదండపాణి గారు చక్కని పాట చేశారు. ' జగమే రామమయం... ఆ చిరునవ్వే అమృతపు జల్లు , అఖిలజగములనేలు ఆ చేతి విల్లు ' హృదయంగమమైన రచన. ]http://satyasense.blogspot.in/ 2010/02/ sadasiva-brahmendra-compositions.html http://www.youtube.com/watch?v=ZXeFj-yOGZo http://www.youtube.com/watch?v=jS2sMzLD9bM http://www.youtube.com/watch?v=LZWbB6eNyLc http://music.raag.fm/Carnatic_Movies/songs-19108-Masters_Choice-Dr_M_Balamuralikrishna http://www.youtube.com/watch?v=Sb-CyfnJpHo

No comments:

Post a Comment